Chance for India : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఏటా వచ్చే కొత్త ఐఫోన్ల కోసం జనం ఎగబడుతూ ఉంటారు. కానీ, ఈ మధ్య చైనాలో కరోనా కారణంగా ఐఫోన్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. డిమాండ్ మేరకు సరఫరా ఉండటం లేదు. దాంతో… మన దేశంలో ఐఫోన్ల ఉత్పత్తి పెంచే ప్రయత్నాలు ప్రారంభించింది… ఆపిల్. ప్రస్తుతం దేశంలో విస్ట్రాన్, ఫాక్స్కాన్ కంపెనీలతో కలిసి ఐఫోన్లు తయారు చేస్తోంది… ఆపిల్. త్వరలో విస్ట్రాన్ కంపెనీని కొని, విస్తరించడం ద్వారా… ఐఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ముందుకొచ్చింది టాటా గ్రూప్. ప్రస్తుతం ఈ డీల్ తుది దశలో ఉంది. అది పూర్తైతే దేశంలో ఐఫోన్ల ఉత్పత్తి గణనీయంగా పెరగనుంది.
అంతేకాదు… చైనాలో కరోనా పరిస్థితులు ఇప్పుడప్పుడే కుదుటపడే సూచనలు కనిపించకపోవడం, అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడో కూడా తేలకపోవడంతో… 2025 నాటికి డ్రాగన్ కంట్రీ వెలుపల 25 శాతం ఐఫోన్లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ వెల్లడించింది. ప్రస్తుతం చైనా తర్వాత ఇండియాలో మాత్రమే 5 నుంచి 7 శాతం ఐఫోన్లను ఉత్పత్తి చేస్తోంది… ఆపిల్. మిగతా 18 నుంచి 20 శాతం ఐఫోన్లను కూడా భారత్లోనే తయారు చేయాలని భావిస్తోందట ఆపిల్. ఈ విషయాన్ని ఓ వాణిజ్య సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వయంగా చెప్పారు. దాంతో… వచ్చే రెండేళ్లలో దేశంలో ఐఫోన్ల ఉత్పత్తిని ఆపిల్ 25 శాతానికి పెంచడం ఖాయమనే ప్రచారం మొదలైపోయింది. అదే జరిగితే భారీగా కొత్త ఉద్యోగాలు వస్తాయనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎప్పటికీ చైనాలో అటు ఆరోగ్య, ఇటు వాణిజ్య పరిస్థితులు మెరుగుపడకపోతే… ఆపిల్, డ్రాగన్ కంట్రీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.
Follow this link for more updates:- Bigtv