Pawan Kalyan: “వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన ప్రభుత్వం వస్తుంది. లేదంటే మిశ్రమ ప్రభుత్వం వస్తుంది”. రణస్థలం వేదికగా జనసేనాని క్లారిటీ ఇచ్చేశారు. మిశ్రమ ప్రభుత్వం అంటే? టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అనేది పవన్ భావం. జనసేనాని చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీల్చబోనంటున్నారు. అంతేగానీ, ఎక్కడా టీడీపీతో పొత్తు ఉంటుందని మాత్రం చెప్పట్లేదు. రాజకీయాల్లో వ్యూహలు ఉంటాయ్.. అవి బయటకు చెప్పనంటూ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. మీడియా మాత్రం టీడీపీ, జనసేన పొత్త కన్ఫామ్ అని.. బీజేపీతోనే ప్రాబ్లమ్ అంటూ వార్తలు వండివారుస్తున్నాయి.
అయితే, ‘యువశక్తి’ సభలో పవన్ కల్యాణ్ గతానికి భిన్నంగా.. మరింత క్లారిటీ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ”మీరు నావెంట ఉంటానని అంటే.. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తా. కానీ, నాకు మీపై నమ్మకం లేదు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందటం సరికాదు” అంటూ జనసేనాని చేసిన కామెంట్లు కొత్త అర్థాలను ఇస్తోంది.
టీడీపీతో పొత్తుకు పవన్ అంతగా ఆసక్తి లేరా? ఒంటరిగా పోటీ చేస్తే గత ఎన్నికల మాదిరే ఓడిపోతాం కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబుకు జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారా? ప్రజల నుంచి ఏకాస్త భరోసా వచ్చినా.. తాను గెలుస్తాననే నమ్మకం వచ్చినా.. సింహం సింగిల్ గానే అన్నట్టు పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారా? కానీ, ఏపీలో ఇప్పటికిప్పుడు తాను ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేనందుకే.. జగన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనీయకూడదనే పట్టుదలతోనే.. ఇష్టం లేకపోయినా.. టీడీపీతో పొత్తుకు పవన్ ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందని అంటున్నారు.
2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి చంద్రబాబును నవ్యాంధ్ర తొలిముఖ్యమంత్రిని చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు పాలనపై, లోకేశ్ అవినీతిపై జనసేనాని పలుమార్లు విమర్శలు చేశారు. టీడీపీ పాలనపై ఇష్టం లేకే.. 2019లో సొంతంగా బరిలో దిగి చేతులు కాల్చుకున్నారు. ఈసారి మళ్లీ 2014 పరిస్థితే రావడం జనసేనాని దూకుడుకు బంధనాలు వేసిందని అంటున్నారు. అందుకే, ఈసారి కొన్ని కండిషన్లు పెట్టి.. ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలనేది జనసేనాని వ్యూహంలా కనిపిస్తోంది.
టీడీపీతో పొత్తు పెట్టుకుని.. దాదాపు సగం సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్క కాస్త తగ్గినా.. పొత్తు మాత్రం కొనసాగించేందుకే పవన్ ఆసక్తి కనబరిచే ఛాన్స్ ఉంది. గెలిస్తే.. ‘అధికారం చెరి సగం’ అనేది పవన్ వ్యూహం అంటున్నారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని.. రెండు పార్టీలు సమానంగా పంచుకునేలా డీల్ మాట్లాడాలని జనసేనాని అనుకుంటున్నారు.
అయితే, ఫస్ట్ టర్మ్ సీఎంగా ఎవరుండాలనేది కీలకం. సీనియర్ ను కాబట్టి తానే మొదట సీఎం అవుతానని చంద్రబాబు పట్టుబట్టొచ్చు. స్వతహాగా ఉదార స్వభావమున్న పవన్ కల్యాణ్ సైతం అందుకు ఓకే చెప్పొచ్చు. రెండో అర్థభాగంలోనే ముఖ్యమంత్రి పీఠంపై కుర్చునేందుకు పవన్ అంగీకరించవచ్చు. ఇదంతా అనుకున్నది అనుకున్నట్టు సాగితే ఓకే. లేదంటే మళ్లీ పోరాటం తప్పకపోవచ్చు. జగన్ ను ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్న జనసేనాని.. ఇష్టంలేక పోయినా.. తప్పటం లేదుకనుక.. చంద్రబాబుతో పొత్తుకు ముందుకు వస్తున్నారని అంటున్నారు.