Gottipati Ravikumar Slams on YS Jagan: అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. లేదంటే సభకు వచ్చి ఉపయోగం ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారాయన. తాను గెలిచినప్పుడు టీడీపీకి ప్రతిపక్షహోదాపై ఎమ్మెల్యేల లెక్కలు చెప్పిన జగన్.. ఇప్పుడు దాని కోసం అభ్యర్ధిస్తూ ద్వంద వైఖరి ప్రదర్శిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అదీకాక ఆ 4 పేజీల లెటర్లో అన్నీ అబద్దాలే పేర్కొన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీలో 11 స్థానాలే దక్కాయి. సభలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, జగన్కు ప్రతిపక్ష నేత హోదా లభించాలంటే కనీసం పది శాతం సీట్లలో అంటే.. 18 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఏడు స్థానాలు తగ్గాయి. దీంతో స్పీకర్ ఆయన్ను సభలో వైసీపీ శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తారు తప్ప ప్రతిపక్ష నేతగా గుర్తించే వీలు లేకుండా పోయింది. అయినా సరే.. తనకు విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని.. లేదంటే అసెంబ్లీకి రానన్నట్లుగా బెదిరించే ధోరణిలో జగన్ స్పీకర్కు లేఖ రాశారు.
కొత్త అసెంబ్లీ సమావేశాల తొలిరోజు మాజీ ముఖ్యమంత్రినైన తనను సీఎం చంద్రబాబు తర్వాత కాకుండా మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించడం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారని … ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని.. పార్లమెంటులో గానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదని అన్నారు. ‘1984లో లోక్సభలో టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో 294 స్థానాలకు కాంగ్రెస్ 26 సీట్లలో గెలిచింది. నాడు కాంగ్రెస్ నేత పి.జనార్దన్రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని జగన్ పేర్కొన్నారు.
Also Read: Jagan alone in Bangalore : బెంగళూరులో ఒంటరిగా జగన్.. ఏం చేస్తున్నారు అక్కడ ?
జగన్ తన లేఖలో పేర్కొన్నట్లుగా.. పర్వతనేని ఉపేంద్ర 1984లో లోక్సభ సభ్యుడు కాదు. ఆ ఏడాది ఏప్రిల్లో ఆయన రాజ్యసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. అలాగే 1994లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పి.జనార్దన్రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించలేదు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా మాత్రమే గుర్తించారు. అప్పట్లో ఆయన చేత అసెంబ్లీలో అక్షర క్రమంలో అందరు ఎమ్మెల్యేలతో సమానంగానే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు జగన్తో కూడా అలాగే చేయించవచ్చు. కానీ… ఆయనకు ప్రత్యేక గౌరవం ఇస్తూ ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిని కూడా జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. సభకు రాకుండా తప్పించుకోవడానికి ముందుగానే ఆయన సాకులు వెతుక్కుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ప్రతిపక్షహోదాకు అవసరమైన ఎమ్మెల్యే లెక్కలకు సంబంధించి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ సభాసాక్షిగా చెప్పుకొచ్చారు. అప్పుడు టీడీపీ 23 సీట్లు గెలిచి ప్రతిపక్షహోదా దక్కించుకుంది. దానిపై జగన్ మాట్లాడుతూ అయిదుగిర్ని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని.. తనదైన స్లైల్లో నిండు సభలో చంద్రబాబును ఏకవచనంతో సంభోదిస్తూ వైపు వేలు చూపించి మరీ మాట్లాడారు.
Also Read: ఏపీకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రాక, వైసీపీ ఆగడాలకు చెక్ తప్పదా?
ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే సభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. అయితే అప్పటి లెక్కలను ఇప్పుడు జగన్ మర్చిపోయినట్లు .. ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ.. తానే ప్రతిపక్ష నేతనని జగన్ చెబుతున్నారు. ఈ నెల 21న సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్రతిపక్ష నేతగా తనను ప్రమాణం చేయించకపోవడం తప్పని స్పీకర్కు రాసిన లేఖలో నొక్కి వక్కాణించారాయన. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు.
జగన్ విచిత్ర వాదనపై అధికారపక్షం నేతలు ఆయన్ని యద్దేవా చేస్తున్నారు. సీఎంగా జగన్ సభలో మాట్లాడినప్పుడు తాము సభలోనే ఉన్నామని సంప్రదాయాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయా? అధికారంతో విర్రవీగినపుడు ఒకలా.. జనాలు ఛీకొట్టాక మరోలా ఉంటాయా?’ అని టీడీపీ సీనియర్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు .. జగన్ అలా లెటర్ రాయాడాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు తనదైన స్టైల్లో యద్దేవా చేశారు.
Also Read: New Telecom Act : హలో..హలో.. కాస్త మాటలు జాగ్రత్త !.. కొత్తచట్టంలో ఎమర్జెన్సీ మార్క్ !
స్పీకర్ని ఉద్దేశించి మంగళవారం జగన్ రాసిన లేఖపై ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయకపోతే క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విరుచుకుపడ్డారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీపై ఇప్పటికే ఆడదాం ఆంధ్రా క్రికెట్ టీం.. అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక వాలీబాల్ టీం అంటే ఆరుగురే ఆడేది. మొత్తానికి జగన్ అందరికీ అలా టార్గెట్ అవుతున్నారిప్పుడు.