Big Stories

AP MlC Election Schedule: లెక్క తగ్గింది.. టీడీపీ ఏకగ్రీవం

- Advertisement -

ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు పలికారని ఎమ్మెల్సీలపై అర్థరాత్రి పూట అనర్హతా వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం.. అయితే అది ఆ పార్టీకే రివర్స్ అవుతోంది. ఎందుకంటే ఆ ఖాళీలన్నీ టీడీపీ ఖాతాలో చేరిపోతున్నాయి. మొత్తం నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేశారు. అందులో ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఉన్నారు. మరో ఇద్దరు స్థానిక సంస్థల కోటాలో గెలిచారు. కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య, అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిద్దరు టీడీపీలో చేరడంతో అనర్హత వేటు వేయించారు జగన్.

- Advertisement -

ఆ ఇద్దరు రాజీనామాలు ఇచ్చినా అనర్హతా వేటు వేయించారు. ఇప్పుడు ఉపఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2 తుది గడువిచ్చింది. ఉపసంహరణకు ఆ నెల 5 వరకు గడువు ఉంది. జులై 12న పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇప్పుడు ఉన్న బలాబలాలను చూస్తే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీకి అసలు పోటీ చేసే చాన్స్ కూడా లేదు. అంటే రెండు స్థానాలు ఏకగ్రీవం అవుతాయి. అనర్హతా వేటు వేయకపోతే.. కనీసం సాంకేతికంగా అయినా వారు వైసీపీ సభ్యులుగా ఉండేవారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమాకు పోయి.. ఆ అవకాశాన్ని కూడా కోల్పోయింది.2018లో వైసీపీలో చేరిన సి.రామచంద్రయ్యను. 2021లో ఎమ్మెల్సీ పదవి వరించింది.

Also Read: ఏపీ.. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం..

ప్రస్తుతం ఆయనకు మరో మూడేళ్లకుపైగా పదవీకాలం ఉంది. టీడీపీలో రాజకీయం జీవితం ప్రారంభించి మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రామచంద్రయ్య తర్వాత పీఆర్పీ బాట పట్టి.. దాని విలీనం తర్వాత కాంగ్రెస్ చలవతో ఎమ్మెల్సీ అయ్యి, మరో సారి మంత్రిగా కూడా పనిచేశారు .. తర్వాత వైసీపీలో చేరి పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్, వైసీపీల్లో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబును ఒక రేంజ్లో టార్గెట్ చేసిన చరిత్ర ఉంది. ఆ క్రమంలో ఈ సారి టీడీపీ ఆయనకు మరో అవకాశం ఇవ్వడం డౌటే అంటున్నారు.

మరో మాజీ ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ అనంతపురం జిల్లాలోని హిందూపురం నేత .. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన్ని 2019లో ఎమ్మెల్సీని చేసింది. 2021లో రెండో సారి ఎమ్మెల్యే కోటాలో మరోసారి ఎమ్మెల్సీ అవకాశమిచ్చింది. ఆయన పదవీ కాల 2027 మార్చి వరకు ఉంది.

అయితే హిందూపురం నుంచి మరోసారి పోటీ చేయాలని భావించిన ఇక్బాల్‌కు జగన్ టికెట్ నిరాకరించడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రికమండేషన్‌తో బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీపికను తీసుకొచ్చి హిందూపురంలో బాలయ్యపై నిలబెట్టిన వైసీపీ బొక్కబోర్లా పడింది. ఇక్బాల్ చేరిక టీడీపీకి ప్లస్ అయి.. 32,597 ఓట్ల మెజార్టీతో బాలయ్య హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఆ క్రమంలో ఈ సారి మాజీ ఐపీఎస్ అయిన ఇక్బాల్‌కు మైనార్టీ కోటాలో చంద్రబాబు ఛాన్స్ ఇస్తారంటున్నారు.

ఇక రెండో స్థానానికి టీడీపీ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది. రేసులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ముందు కనిపిస్తున్నారు. జనసేనాని పవన్‌కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసిన ఆయన పవన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పవన్ 70,279 మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించడం వెనుక వర్మ పోషించిన రోల్‌ని ఎవరూ కాదనలేదు. అసలు వర్మ సీటు త్యాగం చేసినప్పుడే మొట్టమొదటి ఎమ్మెల్సీ పదవి ఆయనకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేయాలని పవన్‌ కూడా పట్టబట్టే అవకాశం కనిపిస్తుంది.

Also Read: ఏపీలో మార్పు కనిపిస్తోంది.. ఇదే కొనసాగితే ఇక అద్భుతాలే!

ఇక విశాఖపట్నంకు చెందిన వంశీకృష్ణయాదవ్ స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన దానికి రాజీనామా చేసి విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజీనామాను ఆమోదించకుండా వైసీపీ అనర్హత వేటు వేసి విమర్శలు మూటగట్టుకుంది. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2021లో ఎన్నికైన ఇందుకూరి రఘురాజుపై కూడా వేటు పడటంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది.

58 మంది సభ్యులున్న శాసనమండలిలో వైసీపీకి 45 మంది సభ్యులుండే వారు. ఇప్పుడీ నలుగురూ దూరమయ్యారు. మరోవైపు గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్చే జంగా కృష్ణమూర్తి కూడా ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ఘోర పరాజయంతో మరింత మంది ఎమ్మెల్సీలు కూటమికి జైకొట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికైతే కొత్త ప్రభుత్వంలో శాసనమండలి సమావేశాలు మొదలుకు కాకుండానే ఆ పెద్దల సభలో వైసీపీ బలం 45 నుంచి 40కి పడిపోవడం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News