Big Stories

Politics Tension In Chittoor YCP: చెవిరెడ్డి కొడుక్కి వెన్నుపోటు.. అందుకే ఆ వేటు?

- Advertisement -

తాజాగా చంద్రగిరిలోని సీనియర్ నాయకుడు అయిన ఎమ్యార్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దానికి కారణం ఆయన టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానికి సహాకరించారని చెప్తున్నారు. ఎమ్మార్సీ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు.. గతంలో ఎమ్మెల్సీ కోసము ప్రయత్నించారు. అయితే దానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో ఈ సారి ఎన్నికలలో చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెర్సీ రెడ్డి వర్గం పనిచేసిందని అంటున్నారు. సొంత మండలం ఎర్రవారిపల్లితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మార్సీ రెడ్డి చెవిరెడ్డి వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి  టీడీపీకి అనుకూలంగా పనిచేయించారంట.

- Advertisement -

చంద్రగిరి ఎమ్మెల్యే , ఈ సారి ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి అత్యంత పర్సనల్ మనిషి ఈయన అడిగింది ఆయన కాదనరు.. ఆయన చెప్పింది ఈయన శిరసావహిస్తారన్న టాక్ ఉంది. అలాంటి చెవిరెడ్డి ఈసారి చంద్రగిరిలో గెలుపుపై ధీమాతో తన కుమారుడు మోహిత్‌రెడ్డికి వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. తాను ఒంగోలు ఎంపీగా పోటీలో ఉన్నా.. చంద్రగిరిపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేసి ప్రచారంలో తనదైన మార్క్ చూపించారు. తన రాజకీయ గురువు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మంత్రి రోజా ఇలా తిరుపతి జిల్లా ముఖ్యనేతలందరితో ఆత్మీయసమావేశాలు పెట్టి చెవిరెడ్డి తన కుమారుడి విజయం కోసం కృషి చేశారు.

Also Read: కోటంరెడ్డి కొంప కొల్లేరా? ఆదాల అడ్రస్ గల్లంతా?

అంత కష్టపడిన చెవిరెడ్డి చంద్రగిరిలో పోలింగ్ తర్వాత పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో గ్రౌండ్ లెవల్లో ఏం జరిగిందనే దానిపై పోస్ట్ మార్టం నిర్వహించారంట. గత ఎన్నికల్లో చెవిరెడ్డి మార్క్ పోల్ మేనేజ్‌మెంట్ పనిచేసి 89 శాతం పోలింగ్ నమోదైంది. అది ఈ సారి 79.89 శాతానికి తగ్గిపోయింది. దాంతో సమీక్షించుకున్న ఆయన ఆశించిన స్థాయితో ఓటర్లు బూత్‌లకు రాకపోవడానికి నమ్ముకున్న కేడరే కారణమని భావిస్తున్నారంట. ఆ క్రమంలోనే ఎమ్మార్సీ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందంటున్నారు. ఎన్ని నోట్లు వెదజల్లినా వెన్నుపోట్ల కారణంగా అవి ఓటర్లకు చేరలేదన్న ఫ్రస్ట్రేషన్‌తోనే టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానిపై దాడికి తెగబడ్డారంటున్నారు.

నగరి నియోజకవర్గంలో కూడా వెన్నుపోటు రాజకీయం అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరున్న కెజె కూమార్ వర్గం పార్టీలో ఉంటూ రోజాకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా.. టీడీపీకి ఓటు వేయమని చెప్పారని సాక్షాత్తు మంత్రి రోజా నే తమ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అంతకు ముందు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కోసం చంద్రగిరి సభలో పాల్గొన్నప్పుడు ఆమె విజయంపై ఒక రేంజ్లో ధీమా వ్యక్తం చేశారు.

అంత ధీమాగా కనిపించిన రోజా పోలింగ్ ముగియగానే ఢీలా పడిపోయినట్లు కనిపించారు. నగరిలో తనను సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని సొంత మీడియా ముందు వాపోయారు. మరోవైపు పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు సీనియర్లు పార్టీ నుంచి బయటకు పోయి టిడిపికి మద్దతు ప్రకటించడం వెనుక కూడా వైసీపీ సీనియర్ల హాస్తం ఉందన్న ప్రచారం జరుగుతుంది.

చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఇదే విదంగా నడిచిందంటున్నారు. మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ అయిన బుల్లెట్ సురేష్ ఎన్నికలలో వైసీపీ తరపున కనీసం ప్రచారం చేయలేదు. ఆయన తన వర్గానికి కూడా ఎన్నికలలో పనిచేయమని చెప్పలేదు. వీరంతా టీడీపీకి అనుకూలంగా పనిచేసారని అంటారు. బుల్లేట్ సురేష్ సైతం పెద్దిరెడ్డి అనుచరుడు కావడం విశేషం.. తిరుపతి నియోజకవర్గంలో సైతం ఇదే విధంగా వైసీపీలో ఓవర్గం పార్టీ కోసం పనిచేయలేదు. వీరిలో కొంతమంది ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేనలో చేరిపోయారు.

పలమనేరు నియోజకవర్గంలో సైతం వెంకటే గౌడ్ కు వ్యతిరేకంగా చిత్తూరు కోఅపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయిన రెడ్డెమ్మ వర్గంతో పాటు జడ్పీటిసి వర్గం పనిచేయలేదన్న ప్రచారం ఉంది. జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూడా మాజీ ఎంపి , విదేశీ వ్యవహారాల సలహాదారు అయిన జ్ణానేంద్రరెడ్డి వర్గం సైతం డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కోపంతో పార్టీ కోసం పనిచేయలేదంట. మాజీ మంత్రి వర్గంతో పాటు పాలసముద్రం మండలానికి చెందిన క్షత్రియ సామాజిక వర్గం నేతలు సైతం వైసీపీకి యాంటీ అయ్యారంట.

Also Read: పిఠాపురంలో అల్లర్లు!! హైటెన్షన్!

శ్రీకాళహస్తిలో సైతం వైసీపీలోని ఓ వర్గం పనిచేయకుండా సైలెంట్ గా ఉంది. పరోక్షంగా టిడిపికి మద్దతు ఇచ్చిందంట. అయితే చివరి నిమిషంలో మేల్కొన్న ఎమ్మెల్యే బియ్యము మధుసూదన్ రెడ్డి సదరు నేతతో కాళ్లబేరానికి వెళ్లి తన గెలుపు కోసం పనిచేయమని కోరారంట. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని క్యాడర్ అంటోంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా వైసీపీలోని ఓవర్గం లోపాయికారీ గా పనిచేసిందంట. అక్కడ టీడీపీ ఓట్లను చీల్చడానికి వైసీపీ ఇద్దరిని స్వతంత్రులుగా పోటీ చేయించిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్ధి కోనేటి ఆదిమూలానికి వైసీపీ శ్రేణులు సహకరించాయంట.

మొత్తమ్మీద తిరుపతి, చంద్రగిరి, పలమనేరు, నగరి, జీడినెల్లూరు, సత్యవేడుల్లో వైసీపీకి గట్టిగానే వెన్నుపోటు పడిందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ద్వీతీయ శ్రేణి నాయకులకు విలువ ఇవ్వక పోవడం వల్లే ఈవిధంగా జరిగిందని క్యాడర్ అంటున్నారు. మరి చూడాలి ఈ వెన్నుపోటు రాజకీయాలు జిల్లా రాజకీయ సమీకరణలను ఏ మలుపు తిప్పుతాయో?

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News