YS Jagan Letter to Speaker Ayyanna Patrudu: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ అన్నయ్య పాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. శాసన సభలో మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉందని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని అన్నారు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదని తెలిపారు.
ప్రజా సమస్యలు చట్ట సభల్లో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందే అని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో జరిగిన పలు అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శతృత్వం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయట పడ్డామని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని జగన్ సూచించారు. అంతే కాకుండా తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.
తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించింది. విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. చంద్రబాబు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి.. అధికారులతో వైసీపీకి బలవంతంగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తున్నందని పేర్కొంది. ఇదిలా ఉంటే కూటమి మాత్రం శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో జగన్కు తగిన గౌరవం ఇచ్చామని వెల్లడించింది. అసెంబ్లీ 175 స్థానాల్లో వైసీపీ 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా ఆయన కూడా సాధారణ సభ్యుడే అనే వాదన ఉంది. కానీ జగన్కు సభలో ప్రాధాన్యం ఇవ్వాలని శాసన సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేషవ్ కూడా రిక్వస్ట్ చేశారు.
Also Read: నాయకులకు తెలిసిన నిజం.. జగన్ తెలియలేదా ?
ఆ విషయాన్ని పయ్యావుల, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మాజీ సీఎం పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు. సాధారణంగా ఎమ్మెల్యేలు తమ వాహనాలను అసెంబ్లీ బయటే ఉంచాలి. అక్కడే కారు దిగి లోపలికి రావాలి. కానీ జగన్ తన వాహనంలోనే సభా ప్రాంగణంలోకి రావడానికి అనుమతించాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు అసెంబ్లీ భవనంలోని ప్రధాన ద్వారం వరకూ ఆయన వాహనాన్ని అనుమతించారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో ఆయన మిగిలిన సభ్యులతో పాటు అక్షర క్రమంలో తన పేరు వచ్చినప్పుడు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కాని సీఎం తన ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారట. జగన్ ఆలస్యంగా రావడంతోనే ఆయన ప్రమాణ స్వీకారం మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత చేశారని చెబుతున్నారు.