Tufan: మండుటెండల్లోనూ వానలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలకే రైతులు ఎంతో నష్టపోయారు. ఇప్పుడు తుఫాన్ రూపంలో మరోసారి ముప్పు పొంచి ఉంది. రాగల మూడు రోజుల్లో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతోంది. ఇది తుఫానుగా మారనుంది. దానికి మోకా తుఫాన్గా ఇప్పటికే పేరు పెట్టారు. దీని ప్రభావంతో రాబోయే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అంతేకాదు.. దక్షిణ కర్ణాటకను ఆనుకొని తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. మోకా తుఫాన్ ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చని వాతావరణశాఖ భావిస్తోంది. ఈ తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్లే అవకాశముందని తెలిపింది.
అల్పపీడనం నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. వేటకు వెళ్లిన వారు శనివారం సాయంత్రంలోగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.