![ttd](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/08/ttd.jpg)
TTD: చిన్నారిని చిరుత చంపేసింది. గతంలోనూ పిల్లాడిపై దాడి చేసింది. మొదటి దాడికే గుణపాఠం నేర్చిఉంటే ఇప్పుడీ మరణం జరిగుండకపోయేది. పాప ప్రాణం పోయాక.. టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. పలు నిర్ణయాలు తీసుకుంది.
ఈసారి కూడా రక్షణ భారం భక్తుల మీదే పెట్టారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. కాలినడక దారిలో జంతువులకు ఎలాంటి ఆహరం పెట్టొద్దని.. పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్ల మార్గంలో చెత్త వేసే షాపుల యాజమాన్యాలపై యాక్షన్ ఉంటుందన్నారు. కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక చేతికర్ర ఇస్తామని.. కర్రే ఇకపై భక్తులకు ప్రధాన ఆయుధమంటోంది టీటీడీ. అయితే, టీటీడీ తీరుపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. అంటే, ఇక మీదట చిరుత ఎదురైతే.. కర్రతో భక్తులే పోరాడాలా? అంటూ మండిపడుతున్నారు కొందరు.
ఘాట్రోడ్లో పలు ఆంక్షలు విధించింది టీటీడీ. టూవీలర్స్కు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇస్తామంది. కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి ఉంటుందని.. పిల్లలను మాత్రం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే.. పేరెంట్స్తో అనుమతిస్తామని స్పష్టం చేసింది. భక్తులను గుంపులుగా మాత్రమే పంపుతామని ప్రకటించింది టీటీడీ.
నడకదారిలో ఇరువైపులా ఫోకస్ లైట్లు.. భక్తులకు అప్రమత్తం చేసేలా సైన్బోర్డులు.. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు.. భక్తుల సెక్యూరిటీ కోసం నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు టీటీడీ ఛైర్మన్ భూమన.
తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాలు ఏర్పాటు చేస్తామని.. అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలు కూడా వాడతామని చెప్పారు. కేంద్ర అటవీశాఖ అధ్యయనం తర్వాత దారికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంటామని.. అయితే, చెట్లను సైతం ఎక్కగల చిరుతను.. ఫెన్సింగ్తో అడ్డుకోలేమని అన్నారు.