TDP : ఏపీలో ఓ మహిళా టీడీపీ నేత అరెస్ట్ పొలిటికల్ హీట్ ను పెచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై రెండు కేసులు నమాదయ్యాయి. ఈ కేసులో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణిని పోలీసులు నిందితురాలిగా పేర్కొన్నారు. అప్పట్నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా హనుమాన్ జంక్షన్లోని నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తెల్లవారుజామున కల్యాణి ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు, కల్యాణి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇంత దుర్మార్గమా..?: చంద్రబాబు
మూల్పూరి సాయి కల్యాణి అరెస్ట్ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఓ మహిళను బెడ్రూంలోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.
వ్యవస్థకే కళంకం: లోకేశ్
సాయి కల్యాణి అరెస్ట్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఓ మహిళపై ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతల మెప్పు కోసం పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కల్యాణికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.