Amaravathi :పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య సవాళ్లు అమరావతిలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించాయి. టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాల్లో అప్పటి ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అవినీతికి పాల్పడ్డారని సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆరోపించారు. గత నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కొమ్మాలపాటి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇద్దరి నేతల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో పరస్పరం సవాళ్లు చేసుకున్నారు.
అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామంటూ నంబూరు, కొమ్మాలపాటి పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బహిరంగంగా చర్చిందామంటూ ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో అమరేశ్వర ఆలయానికి చేరుకునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో శంకర్రావు బస చేశారు. అమరావతిలోని ఓ కార్యకర్త ఇంట్లో కొమ్మాలపాటి ఆశ్రయం తీసుకున్నారు. ప్రమాణ సమయానికి ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేయడంతో….కొమ్మాలపాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆలయం వైపునకు వస్తున్న టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్ వ్యాన్ పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో వ్యాన్ అద్ధాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు తీరుపై కొమ్మాలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోకుండా టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
మరోవైపు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. కొమ్మాలపాటి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. వైసీపీ కార్యకర్తలు శ్రీధర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమరావతిలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ ఆదినారాయణ శనివారమే ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు లేదా ప్రమాణానికి రావద్దని సూచించారు. 200 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా సరే టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.