TDP MLA Madhavi Reddy Comments on Jagan’s Letter: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ఆర్. మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ స్పీకర్ కు లేఖ రాయడం సిగ్గుచేటని ఆమె అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ఆ హోదా వస్తుందనే విషయం కూడా జగన్ కు తెలియకపోవడం బాధాకరమన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక కుయుక్తులకు తెరలేపారని ఆమె విమర్శించారు. స్పీకర్ ఎన్నిక రోజు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదన్నారు.
‘గత అసెంబ్లీలో ఆరుగురు శాసన సభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందంటూ మీరన్న మాటలు మీకు గుర్తులేదా జగన్..?. సీఎం అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా..? ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? మీ నియోజకవర్గ ప్రజల సమస్యలను మీరు పట్టించుకోరా..? ఇకనైనా జగన్ అధికార భ్రాంతిని వీడాలి. ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి లేడు. అందువల్లే ఎన్నికల్లో కేవలం 11 సీట్లు ఇచ్చి జగన్ కు బుద్ధి చెప్పారు. అయినా కూడా మారకుండా ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారు’ అని ఆమె తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
Also Read: అప్పటి వరకూ ఆపండి.. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో
ఇదిలా ఉంటే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు.. ఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో కేంద్రమంత్రి కుమారస్వామితో సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి వినతి పత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ ను లాభాలబాట పట్టించే అంశాలకు సంబంధించి చర్చించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్రమంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని ఎంపీలు కోరగా.. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి మరోసారి సమావేశమవుదామని పేర్కొన్నారు.