TDP latest news telugu(AP political news): ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ఒకవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ యువనేత ముందుకుసాగుతున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తెచ్చింది. జగన్ ప్రభుత్వంపై పవన్ పదునైన విమర్శలు చేస్తూ హీట్ ను పెంచారు. వైసీపీ నాయకులు కౌంటర్ల ఇవ్వడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
నాలుగేళ్ల నరకం పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. గల్లీ నుంచి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ ‘నాలుగేళ్ల నరకం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
రాష్ట్రమా… రావణ కాష్టమా..? అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల గురించి ప్రశ్నిస్తూ వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమం దాదాపు నెల రోజులపాటు సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. ప్రచార కార్యక్రమంలో రంగాలవారీగా జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ 40 ఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ ప్రజలకు వివరించనున్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలకే గెలిపిస్తాయన్న విశ్వాసంతో ఉంది. ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించేందుకు గతేడాదే సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కౌంటర్ గానే నాలుగేళ్ల నరకం కార్యక్రమాన్ని టీడీపీ ఇప్పుడు చేపడుతోంది. మొత్తం మీద ఇంకా ఎన్నికలకు 9 నెలలపైగా సమయం ఉన్నా అప్పుడు ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.