![Chandra babu punganur meeting Chandra babu punganur meeting](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/08/cbn-stone-attack.jpg)
Chandrababu naidu meeting today(AP Political News):
టీడీపీ అధినేత చంద్రబాబు.. పులివెందులలో పులిస్వారీ చేశారు. జగన్ ఇలాఖాలో తొడకొట్టి మరీ సవాల్ చేశారు. పులివెందుల సభ ఇచ్చిన జోష్తో పుంగనూరు పయణమయ్యారు. కానీ, ఈసారి సీన్ మారింది. చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం అంగళ్లులో రచ్చ రచ్చ నడిచింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేశారు. టీడీపీ వర్గీయులపై రాళ్ల దాడి చేశారు వైసీపీ శ్రేణులు. ప్రతిగా తెలుగు తమ్ముళ్లు సైతం రెచ్చిపోయారు. చంద్రబాబుపైనా రాళ్ల దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఎస్పీజీ సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అడ్డుపెట్టి.. చంద్రబాబుకు రాళ్లు తగలకుండా రక్షణ కల్పించారు.
వైసీపీ రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేందర్కు తల పగిలింది. పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. అంగళ్లు సెంటర్ మొత్తం రాళ్లతో నిండిపోయింది. పలువురు పోలీసులు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. ఖాకీల తీరుపై ఆగ్రహంతో టీడీపీ శ్రేణులు రెండు పోలీస్ వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేసి రావాలని సవాల్ చేశారు. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా? రండి చూసుకుందామన్నారు. పులివెందులకే వెళ్లాను ఇక్కడికి రాకూడదా? తానూ చిత్తూరు జిల్లా బిడ్డనేనంటూ బాబు ఫైర్ అయ్యారు. తాము ఎవరి జోలికీ పోమని.. తమ జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇక్కడో రావణాసురుడు ఉన్నాడని.. పుంగనూరు వెళ్తున్నానని.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తానని.. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు కల్పిస్తున్న భద్రతపై కేంద్రం స్పందించింది. ఇద్దరికీ కల్పిస్తున్న భద్రతపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ, చీఫ్ సెక్రటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ లేఖపై కేంద్రం స్పందించి.. ఈ లేఖ రాసింది.