Somesh Kumar : తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిని కలిసి జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సీఎం వైెఎస్ జగన్తో సోమేశ్ కుమార్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీకి వచ్చానని సోమేష్ కుమార్ తెలిపారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నానని వివరించారు. వీఆర్ఎస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించాక ఆ విషయంపై క్లారిటీ ఇస్తానన్నారు.
తెలంగాణ క్యాడరలో సోమేశ్కుమార్ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. ఏపీ విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు. సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ స్పందించింది. సోమేశ్కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోమేశ్కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా కొనసాగాలనే యోచనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు సోమేశ్ కుమార్ స్థానంలో తెలంగాణ కొత్త సీఎస్గా శాంతికుమారిని నియమించారు.
తెలంగాణ ఐదో సీఎస్గా 2019 డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు చేపట్టిన సోమేశ్ కుమార్ గత డిసెంబర్ 30 నాటికి మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మంగళవారం నాటికి ఆయన పదవీ కాలం మూడేళ్ల 11 రోజులు అయ్యింది. తెలంగాణలో ఎక్కువ కాలం సీఎస్గా పనిచేసింది ఆయనే. సోమేశ్ కుమార్ ఈ ఏడాది డిసెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు.