Big Relief for Pinnelli from EVM Damage Case: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. జూన్ ఐదు వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈవీఎం డ్యామేజ్ కేసులో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లైంది.
మే 13 ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్ వద్ద ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు.
ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ప్రతిపక్ష నేత కొడుకు నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారని వివరించారు నిరంజన్రెడ్డి. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేశారు. గతంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, అందుకు విరుద్దంగా ఈసీ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈసీకి లేదన్నారు. పిటిషనర్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, తాత్కాలిక రక్షణ కల్పించాలన్నారు.
Also Read: మాచర్ల మిస్టరీ.. పిన్నెల్లి వీడియో ఎలా లీకైంది?
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. జూన్ ఐదు వరకు పిన్నెళ్లిని అరెస్ట్ చేయవద్దని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ ఆరుకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. ఆయా కేసుల్లో సాక్షులుగా ఉన్నవారిని ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. అంతేకాదు అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఎక్కువ మంది ఉండరాదని, వీరి కదలికలపై ఈసీ.. పోలీసులతో నిఘా ఉంచాలని ఆదేశించింది. కేసు లోతుల్లోకి వెళ్లకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి పిన్నెల్లికి కాస్త ఉపశమనం లభించింది. మరి రిజల్ట్ తర్వాత ఏంటి అన్నది అసలు ప్రశ్న. వైసీపీ ప్రభుత్వం వస్తే ఓకే.. అదే కూటమి రూలింగ్లోకి వస్తే ఏంటన్నది క్వశ్చన్ మార్క్?
ఈ కేసులో పిన్నెల్లిని పోలీసులు నిజంగానే అరెస్ట్ చేయలేకపోయారా? తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్ నుంచి మాచర్లకు రావాలంటే కేవలం రెండు గంటల్లో రాగలనని ఆయన టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బహిరంగ సవాల్ విసిరారు. అయినా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించలేదన్న వాదన లేకపోలేదు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినప్పుడు అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు ఎందుకు అడ్డుకోలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు. ఒకవేళ చెబితే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఈసీ ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి పొరుగు రాష్ట్రానికి ఎలా వెళ్లారు. ఈ వ్యవహారంలో పోలీసుల లోపాలను బట్టబయలు చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది.