Pawan Kalyan : ఎన్నికల యుద్ధానికి వారాహి యాత్రతో సిద్ధమవుతున్న జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను మరోసారి హీటెక్కించాయి. జనసేనాని పొత్తులపై మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీతో కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. 2014 కాంబినేషన్ పై కాలమే సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే బీజేపీ కాదంటే కొత్తవాళ్లతో వెళతామని ప్రకటించారు. లేదంటే ఒంటరిగా వెళతామని తేల్చిచెప్పారు.
జనసేనాని బీజేపీతో పొత్తులో ఉండగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో రెండుసార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ఉమ్మడి పోరాటం చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించారు. కానీ పొత్తులపై ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుందని చెప్పారు. అయితే జనసేనాని టీడీపీని కూడా కలుపుకుని పోటీ చేయాలనుకుంటున్నారని ఈ రెండు భేటీలు స్పష్టం చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ కూటమికి జనసేనాని మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను వదిలి ఒంటరిగా ఎన్నికల సమరంలోకి దిగిన పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీకి ఒక్క సీటే దక్కింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లుకు బీజేపీ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనకు ఒకే చెప్పారు. కానీ ఈ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ప్రభుత్వంపై కలిసి పోరాడలేదు. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగిన పవన్ …అక్కడ నుంచి సమాధానం రాలేదనే చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబును కలవడంతో టీడీపీతో కలిసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతోంది. టీడీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదంటోంది. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు బీజేపీకి షాకిచ్చేలా ఉన్నాయి. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితిని పవన్ సృష్టించారు. బీజేపీ కాదంటే కొత్తవాళ్లతో వెళతామని పవన్ చెప్పారు. అంటే టీడీపీతో కలిసి పోటీకి దిగుతామని తేల్చిశారు. అదే సమయంలో టీడీపీకి చెక్ పెట్టేలా కామెంట్ చేశారు. పొత్తులు ఉంటాయని చెబుతూనే కుదరకపోతే ఒంటరి పోరాటానికి సిద్ధమని జనసేనాని స్పష్టం చేశారు. అంటే జనసేన కోరుకున్న సంఖ్యలో సీట్లు ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకుంటేనా పవన్ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తారా?. లేదంటే ఒంటరిగా బరిలోకి దిగుతారా? పవన్ తాజాగా చేసిన ప్రకటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.