Heavy rains: ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాలు కురిసే సమయంలో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశముంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ఓ ప్రకటన చేసింది.
రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నదని, మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్ర వ్యాప్తంగా మరింతగా విస్తరించనున్నాయని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాలతోపాటు అక్కడక్కడ పిడుగులు పడుతాయని పేర్కొన్నది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
Also Read: ప్రపంచలోని టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా అమరావతి: మంత్రి నారాయణ
ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా గాజువాకలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. విజయనగరంలోని పి. లింగవలసిలో 7.8, కాకినాడలోని శంఖవరంలో 5.1, అనకాపల్లిలోని చోడవరంలో 3.7, గూడవల్లిలో 2.4, రామచంద్రాపురంలో 2.3, ఏలూరులోని పట్టిసీమలో 2.1, శ్రీకాకుళంలోని పైడి భీమవరంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొన్నది.