Navy Day :విశాఖ ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నౌకాదళ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ విన్యాసాలు నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎన్ఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం స్వాగతం పలికింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన నౌకాదళ గీతం ఆకట్టుకుంది.
నేవీ డే హైలైట్స్…
జెమినీ బోట్లోకి హెలీకాప్టర్ నుంచి దిగిన మెరైన్ కమాండోలు సముద్ర జలాలపై అత్యంత వేగంగా ఒడ్డుకు దూసుకొచ్చారు. జెమినీ బోట్ నుంచి నేరుగా హెలికాప్టర్లలోకి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అటాక్ చేసేందుకు మెరైన్ కమాండోలు గాల్లోకి లేచారు. నౌకాదళ కమాండో బృందం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఉత్కంఠకు గురి చేసింది. త్రివర్ణ పతాక రెపరెపలతో గగన వీధుల్లో హెలికాప్టర్ విన్యాసాలు అదుర్స్ అనిపించాయి. మెరైన్ కమాండోల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. త్రివర్ణ ప్యారాచూట్లో దిగిన స్కై డైవర్ అనూప్ సింగ్ రాష్ట్రపతికి నౌకాదళ ప్రత్యేక ప్రచురణ ప్రతిని అందించి ఆవిష్కరింప జేశారు. సాహస విన్యాసాల కోసం ఎన్ఎస్ కంజీర్, కడ్మత్ నుంచి సముద్రంపై ఐఎన్ఎస్ దిల్లీ, ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకలు ఉపయోగించారు. గగన తలంలో చేతక్ హెలికాప్టర్ల సాహస విన్యాసాలు అబ్బుర పరిచాయి. నాలుగు యుద్ధనౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు లాండింగ్, టేకాఫ్ అవడం వావ్ అనిపించింది. మిగ్ 29 యుద్ధ విమానాల విన్యాసాలు ఉత్కంఠను కలిగించాయి. యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేయడం ఆకట్టుకుంది.