Kanna Laxminarayana : బీజేపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. హైదరాబాద్ లో టీడీపీ నేతలతో చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని దీంతో కన్నా పసుపు కుండువా కప్పుకోవడం లాంఛనమేనని తేలిపోయింది.
ఫిబ్రవరి 16న బీజేపీకి రాజీనామా చేసిన కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి నచ్చకపోవడం వల్లే పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. కానీ అదే సమయంలో టీడీపీలో చేరతానని వెంటనే ప్రకటించలేదు. కొన్నిరోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. తన అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగానే అనుచరులతో చర్చించారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి 23న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులు, అభిమానులతో ఆదివారం గుంటూరులోని నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు , కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు నేతలు, అభిమానులు ఈ భేటీలో పాల్గొన్నారు. వారిచ్చిన సూచనలను, సలహాలను కన్నా స్వీకరించారు. ఆయనతో ఏన్నో ఏళ్లుగా రాజకీయ ప్రయాణం చేస్తున్న తాళ్ల వెంకటేష్ యాదవ్ , డీఆర్ సుబ్రహ్మణ్యం , సైదారావు టీడీపీలో చేరాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని ..ప్రజాక్షేమం దృష్ట్యా టీడీపీలో చేరాలని కోరారు. తమ లాంటి సీనియర్లు చంద్రబాబుతో కలిసి పనిచేస్తే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై బీజేపీ పోరాటం చేయడం లేదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. అలాంటి పార్టీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లొద్దని గట్టిగా చెప్పారు. టీడీపీలో చేరితేనే మంచిదని దాదాపు అందరు నేతలు సూచించారు.
తొమ్మిదేళ్లుగా ఏ అధికార పదవుల్లో లేకపోయినా తన వెంటే ఉన్న నాయకుల, అభిమానుల సూచనలకు అనుగుణంగానే ముందుకుపోదామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమరావతి ఉద్యమానికి మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేశానన్నారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు కోరిన విధంగా టీడీపీలో చేరతానని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
AP: ఏపీలో రోడ్లు వేస్తున్న ఐప్యాక్!.. అధికారులు అవాక్కు!!
YCP MLC: ఎట్టకేళకు ‘మర్రి’కి ఎమ్మెల్సీ.. మరి, మంత్రి పదవి? వైసీపీ జాబితా ఇదే..