JP Nadda latest news(AP politics): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వచ్చారు. శ్రీకాళహస్తిలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభకు హాజరయ్యారు. ఎలాగూ వచ్చారు కాబట్టి.. వైసీపీని తిట్టాలి కాబట్టి.. పలు విమర్శలు చేశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.
బీజేపీ, వైసీపీల మధ్య రహస్య స్నేహం ఉందనేది ఓపెన్ సీక్రెట్. వీళ్లు వాళ్లకు మద్దతిస్తారు.. వాళ్లు వీళ్లకు సపోర్ట్ చేస్తుంటారు. నాలుగేళ్లుగా వారి బంధం బలంగా కొనసాగుతోంది. కానీ, మధ్యలో జనసేనాని ఎంటరై.. ఏపీ పొలిటికల్ ఈక్వేషన్ను మార్చేస్తున్నారు. బీజేపీని టీడీపీకి దగ్గర చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని మరీ చర్చలు జరిపారు అమిత్ షా, జేపీ నడ్డా. త్వరలోనే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ.. ట్రయాంగిల్ పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా.. ఏపీకి వచ్చి.. సభ పెట్టి.. జగన్ పాలనపై విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నడ్డా ఏమన్నారంటే..
ఏపీలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని.. విమర్శించారు జేపీ నడ్డా. జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని.. మండిపడ్డారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వక పోవడంతో పనులన్నీ నిలిచిపోయాయని చెప్పారు.
ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదంటూ గట్టిగానే మాట్లాడారు నడ్డా.
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తామని అన్నారు. సభ పెట్టింది సీమలోనే కాబట్టి.. రాయలసీమ దశాబ్దాలుగా వెనుకబడిందని.. తమకు అవకాశం ఇస్తే సీమను ప్రగతి పథంవైపు నడిపిస్తామంటూ.. గొప్పగొప్ప మాటలు చెప్పారు జేపీ నడ్డా.