Jagan Govt Scams in Schemes(AP political news): ఏపీలో దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా గత ఐదేళ్లు వైసీపీ పాలన సాగించిందని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి. పౌర సరఫరా శాఖలో సైతం 200 కోట్లకు పైగా భారీ దోపిడి జరిగిందంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కందిపప్పు, పంచదార పంపిణీలో తూకంలో మాత్రమే కాకుండా ధరల్లోనూ వ్యత్యాసం ఉందని ధ్వజమెత్తారు.
పేదలకు ఇచ్చే రేషన్లోనూ వైసీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కందిపప్పు, పంచదార సరఫరాల్లో చేతివాటం చూపారని విమర్శిస్తున్నారు. మంత్రి నాదెండ్ల చేపట్టిన తనిఖీల్లో బండారం బయటపడింది. ప్రతి ప్యాకెట్ 50 నుంచి 80 గ్రాములు తక్కువ బరువే ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే విచారణకు ఆదేశించిన మంత్రి.. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోందని గుర్తించారు.
Also Read : ఏపీలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత
తూకం ఒక్కటే కాదు. ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. నూనె, కందిపప్పు సరఫరాల్లోనే రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని చెబుతున్నారు. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోందని గుర్తించారు. అయినా బెదిరింపులు, వేధింపులతో డీలర్లు నోరు మెదపడం లేదు. ఐదేళ్లలో పౌరసరఫరాల శాఖలో వందల కోట్ల కుంభకోణాలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. విచారణలో వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
కాగా.. ఇటీవల రిషికొండపై కట్టిన భవనాల్లో కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఏర్పాటు చేశారన్న విషయాన్ని టీడీపీ ప్రభుత్వం బయటపెట్టింది. కేవలం భవనాన్ని కట్టడానికే కోట్లరూపాయలను ఖర్చు చేసిన జగన్ సర్కార్.. లోపల ఒక్కో రూమ్ లో కళ్లు చెదిరే డిజైన్లను పెట్టింది. అన్నీ విదేశాల నుంచి తెప్పించినవేనని, జగన్ కోసం ఏర్పాటు చేయించుకున్న బెడ్రూమ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న విషయాలు బట్టబయలయ్యాయి.