Viveka Murder Case(AP News Updates) : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. అవసరమైతే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని ఇప్పటికే సీబీఐ సంకేతాలు ఇచ్చింది. దీంతో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అవినాష్ బెయిలు పిటిషన్ పై వాదనల సమయంలో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ముందుకు వెళ్లడం లేదని.. దర్యాప్తులో చాలా విషయాలు వెల్లడయ్యాయని తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఘటనా స్థలంలో సాక్ష్యాలు చెరిపివేయించారని పేర్కొంది.
ఎంపీ అవినాష్ రెడ్డిని సాక్షిగా పిలిచి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షలతో వివేకా హత్య కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తర్వాతే అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకు సూచించింది.
హైకోర్టు ఆదేశాలతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. తొలుత సోమవారం మధ్యాహ్నం అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయడంతో విచారణను సాయంత్రానికి వాయిదా వేయాలని సీబీఐకు తెలంగాణ హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కాకుండా మంగళవారం ఉదయం 10 గంటలకు రావాలని సీబీఐ ఫోన్ ద్వారా అవినాష్రెడ్డికి సందేశం పంపింది.
అవినాష్రెడ్డి పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ పూర్తికాలేదు. దీంతో మంగళవారం ఉదయం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను మంగళవారం సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయాలన్న న్యాయమూర్తి సూచనలకు సీబీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం విచారణకు హాజరుకావాలని అవినాష్రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేముందు తమ వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆమె ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందా..? లేక అరెస్ట్ తప్పదా..?