Viveka Murder Case: వివేకా హత్య కేసు క్లైమాక్స్కు చేరింది. ఈ నెలాఖరుకల్లా కేసు ముగించేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణాధికారినీ మార్చేసింది. అధికారి మారినా.. నిందితులు మారలేదు. వరుస అరెస్టులతో ఉత్కంఠ రేపుతోంది సీబీఐ. ఇప్పటికే వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నెక్ట్స్ అవినాష్రెడ్డియే అంటూ ప్రచారం జరుగుతోంది. సీబీఐ దూకుడుకు జగన్ సైతం ఉలిక్కపడుతున్నారు. పర్యటనలు రద్దు చేసుకుని.. కేసు పరిణామాలపై సన్నిహితులతో సమీక్షలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగిన వివేకా మర్డర్ కేస్.. ఈస్థాయికి చేరడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్.. సునీత. వివేక డాటర్.
అవును, వివేకా కూతురు సునీత వల్లే ఈ కేసు చిక్కుముడులు వీడి వేగంగా క్లైమాక్స్కు చేరింది. లేదంటే, ఇంకెన్నాళ్లు సాగేదో. ఈ కేసు కోసం సునీతారెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. తండ్రిని హత్య చేసినవాళ్లు.. తనవాళ్లేనని గట్టిగా నమ్ముతోంది. వాళ్లు తప్పించుకుని బయట తిరుగుతుంటే తట్టుకోలేకపోయారు. హంతకులకు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుదలతో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ న్యాయపోరాటం చేశారు. సీబీఐకూ కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు. వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి సహా 15 మందిని అనుమానితులుగా భావిస్తూ కోర్టుకు వివరాలు సమర్పించింది సునీతనే.
సునీత దూకుడుకు సీఎం జగన్ పలుమార్లు బ్రేకులు వేయాలని చూశారని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో తన భర్తను కూడా అనుమానితుడిగా భావించాలంటూ సీఎం జగన్ తనతో పలుమార్లు అన్నట్టు ఆమె సీబీఐకి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్రెడ్డి వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్తాడని.. అప్పుడు అతనికి ఏమీ కాదని జగన్ చెప్పడం తనకు ఆశ్చర్యం వేసిందని సునీత తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ కేసు సీబీఐకి వెళితే తనకు 12వ కేసు అవుతుందని కూడా జగన్ అన్నారని సునీత చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.
ఇక, సీబీఐ దర్యాప్తూ ఆమె ఆశించినంత వేగంగా జరగలేదు. నిందితులు ఎప్పటికప్పుడు బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడల్లా.. సునీత సైతం ఆ పిటిషన్లలో ఇంప్లీడ్ అవుతూ వారి బెయిల్ ప్రయత్నాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. లేటెస్ట్గా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్రెడ్డి పిటిషన్ వేయగా.. ఇందులోనూ సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారంటే ఆమె కమిట్మెంట్ ఎలాంటిదో తెలుస్తోంది.
వివేకా హత్య కేసును ఏపీ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా.. విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో.. సునీత నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ మేరకే.. దర్యాప్తు పర్యవేక్షణను తెలంగాణ హైకోర్టుకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అటు, విచారణాధికారి రాంసింగ్ను సైతం మార్చేసి.. స్పెషల్ సిట్ ఏర్పాటు చేసి.. ఈనెలాఖరు కల్లా విచారణ పూర్తి చేయాలంటూ డెడ్లైన్ పెట్టింది సుప్రీం. అందులో భాగంగానే.. ఇప్పుడు సీబీఐ ఉచ్చు.. అవినాష్రెడ్డి మెడకు చుట్టుకుంటోంది.
బహుషా, అందుకేనేమో ఎంపీ అవినాష్రెడ్డి.. నేరుగా సునీతపై, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. సునీత, సీబీఐ ఒక్కటేనని.. చంద్రబాబు డైరెక్షన్ అని.. తమను ఇరికించడానికి కుట్ర చేస్తున్నారని అవినాష్రెడ్డి విమర్శిస్తున్నారు. సునీత భర్త రాజశేఖర్రెడ్డికే వివేకా హత్య విషయం తనకంటే ముందు తెలిసిందని.. అయినా ఆయన పోలీసులకు చెప్పలేదని, స్పాట్లో దొరికిన లెటర్ను కూడా సాయంత్రం వరకూ దాచారంటూ.. పలు ఆరోపణలు చేస్తున్నారు అవినాష్రెడ్డి. ఇలా తనను, తన భర్తను టార్గెట్ చేస్తున్నా.. సునీత మాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు. న్యాయం కోసం మరింత గట్టిగా పోరాడుతున్నారు. జగన్ లాంటి వ్యక్తిని కాదని ఎదిరించడం పెద్ద సాహసమే. కుటుంబ సభ్యులైనా కూడా, తన తండ్రిని చంపడంలో వారి హస్తం ఉందని భావిస్తున్న వైఎస్ భాష్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలకు శిక్ష పడే వరకూ వదిలేరా లేరు సునీత.