Sidda Raghava Rao Resigned to Ysrcp : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్సీపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శిద్దా రాఘవరావు తన లేఖలో వెల్లడించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు శిద్ధా రాఘవరావు. జనసేన మద్దతు కూడా ఉండటంతో.. అప్పట్లో కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా పడ్డాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో శిద్దా రాఘవరావును టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన శిద్దా రాఘవరావు టీడీపీని వీడి.. వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి దర్శి టికెట్ ఆశించగా.. అధిష్టానం మొండిచేయి చూపించింది. దర్శి టికెట్ ను మరొకరికి కేటాయించడంతో.. పార్టీ వీడేందుకు ఆయన సిద్ధమయ్యారన్న వార్తలొచ్చాయి. కానీ ఇంతలో ఆయనకు జగన్ నుంచి పిలుపు రావడంతో.. పార్టీ ఫిరాయింపుకు బ్రేక్ పడింది. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో.. టీడీపీలో చేరతారన్న వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.