Big Stories

Ambati Rambabu Missing: అడ్రస్ లేకుండా పోయిన అంబటి.. అసలు ఆయన పొలిటికల్ కెరీర్ ఏంటో తెలుసా..?

EX Minister Ambati Rambabu Missing: మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్రస్ లేకుండా పోయారు. ఆయనెక్కడున్నారో? ఏం చేస్తున్నారో? ఎవరికీ అంతుపట్టడం లేదు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న అంబటి.. ఎన్నికల ముందు మామూలు కబుర్లు చెప్పలేదు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సహా అందర్నీ ఓడిస్తామని తెగ ప్రగల్భాలు పలికారు. సత్తెనపల్లిలో తాను గెలిచేసినట్లు ముందే చిందులు కూడా వేసారు. సీన్ కట్ చేస్తే మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సీనియార్టీ ముందు చిత్తై.. ముఖం చూపించలేక గాయబ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

అంబటి రాంబాబు.. వాయిస్ ఆఫ్ వైసీపీ.. అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌లతో ఇతర ముఖ్య విపక్ష నేతల్ని తిడుతుంటే చిత్రమైన నవ్వుతో మురిసిపోయిన జగన్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఎలాగో తెలిసిన అంబటి.. దాన్ని చక్కగా వాడుకున్నారు. సందర్భమున్నా లేకపోయినా.. అసెంబ్లీలోనూ, బయటా చంద్రబాబుపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని చివరి రెండేళ్లలో జగన్ కేబినెట్ బెర్త్ దక్కించుకోగలిగారు.

- Advertisement -

అలాగని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదో పెద్ద పొలిటీషియన్ అనుకునేరండోయ్. తన 36 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండంటే రెండు సార్లే. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ లాయర్.. మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా ఆయన ఫేస్ వాల్యూతో కాదులెండి.

Also Read: అంబటికి అల్లుడి రివర్స్ కౌంటర్.. మరో బండారం బట్టబయలు

సరిగ్గా ఆ ఎన్నికల ముందు కాపునాడు వ్యవస్ధాపకుడు వంగవీటి మోహన్ రంగా విజయవాడలో హత్యకు గురయ్యారు. దాంతో యావత్ రాష్ట్రం భగ్గుమంది. కాపు సామాజికవర్గంలో వచ్చిన వ్యతిరేకతతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. కాపు సామాజికవర్గం గణనీయంగా ఉండే రేపల్లె సెగ్మెంట్లో అదే వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు జాక్‌పాట్ తగిలి ఎమ్మెల్యే అయ్యారు. అది మొదలు తిరిగి ముప్పై ఏళ్ల తర్వాత కాని ఆయన తిరిగి ఎమ్మెల్యే అవ్వలేకపోయారు.

1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి.. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పార్టీ అధికార ప్రతినిధి పోస్టులో కూర్చున్నారు. ఇక అప్పటి నుంచి జగన్‌ వీక్‌నెస్‌ని పట్టేసి.. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని బూతు మంత్రుల లిస్టులో ఫొకస్ అవుతున్నారు. ఆ క్రమంలో 2014లో సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న ఆయనకు పల్నాటిపులి కోడెల శివప్రసాదరావు ఓడించారు. తర్వాత 2019లో రెండో సారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం ఆయనకు దక్కింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆ యాంటీ వేవ్‌ అంబటికి కలిసి వచ్చింది.

ఎమ్మెల్యేగా గెలిచాక అంబటి నోటిదురుసు మరింత పెరిగింది. అటు అసెంబ్లీలో ఇటు బయటా .. జగన్ ముఖం మీద నవ్వు చూడటానికన్నట్లు చంద్రబాబును పదేపదే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తనకి మాత్రమే సాధ్యమైన హావభావాలతో.. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్‌తో చెలరేగిపోయారు. అంబటి వాక్చాతుర్యం తెగ నచ్చేసిన జగన్ ఆయనకు 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ఏకంగా జలవనరుల శాఖ కేటాయించారు.

Also Read: అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు

నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా అంబటి హావభావాలివి. మంత్రికాక ముందు చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడిపై ఆయన చేసిన కామెంట్లు.. టీడీపీ హయాంలో 72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును జనవనరుల శాఖ మంత్రిగా ఉండి కూడా పూర్తి చేయించలేకపోయిన అంబటి రాంబాబు.. ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతున్నా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు సరిగ్గా సీన్ రివర్స్ అయింది. 11 సీట్లతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అచ్చెన్నాయుడ్ని కూడా ఈ సారి ఓడిస్తామని నాలుగేళ్ల క్రితం అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన అంబటి అడ్రస్ లేకుండా పోయారు. అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు తిరిగి వైరల్ అవుతూ.. ఆయన్ని వెక్కిరిస్తుంది.

అసలు ముందు నుంచి అంబటి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానే ఉంటూ వచ్చారు. అంబటి రాంబాబు, సుకన్య అనే మహిళ మధ్య జరిగిన హస్కీ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 2011లోనే ఆయన తన వీక్‌నెస్ తో ఒక స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టుకున్నారు. మంత్రి అయ్యాక వైఎస్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకుని మరోసారి పులుసు పడి గిలాగిలా కొట్టుకున్నారు. ఆఖరికి ఎక్స్‌గ్రేషియా చెక్కుల్లో కమీషన్‌కు కక్కూర్తి పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుడ్ని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని.. ప్రజలు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు.

అంబటి అల్లుడు చేసిన సూచనను సత్తెనపల్లి ఓటర్లు మన్నించారు. ఎన్నికల ముందే డ్యాన్సులు వేసేసిన మాజీ మంత్రిని చక్కగా ఓడించేశారు. ఆ దెబ్బతో సారు కనిపించకుండా పోయారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News