AP Weather Updates: ఒక వైపు వర్షాలు..మరో వైపు వడగాల్పులు. కొన్ని ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం… మరికొన్ని ప్రాంతాల్లో భరించలేని ఉక్కపోత. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో భిన్నవాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాబోయే 3 రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అత్యధికంగా అనంతపురం జిల్లా శెట్టూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం 60 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తీవ్రమైన వడగాల్పులు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వచ్చే 5 రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐంఎండీ కూడా హెచ్చరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను మరింత బలపడింది. అయితే మోచా తుపాను బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ , మయన్మార్ లోని క్యాక్ప్యూ మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీరాన్ని దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావం ఏపీపైనా ఉండటంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం గాలివాన బీభత్సం సృష్టించింది. పూళ్ల, దుద్దేపూడి, కూరెళ్లగూడెం గ్రామాల్లో సుమారు 120కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అంధకారం అలుముకుంది. అలాగే రేకులు ఎగిరిపడి కొన్ని ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. కాలువ గట్టు పక్కన ఉన్న ఆటోలు గాలుల దాటికి నేరుగా కాలువలోకి వెళ్లిపోయాయి. విద్యుత్ పునరుద్ధరణకు మరో 2,3 రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.