Weather Report: గత కొన్ని రోజులుగా అటు భానుడి భగభగలు.. ఇటు అకాల వర్షాలతో అల్లాడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. గతంలో వరుసగా వానలు పడటంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లు అయ్యింది. ఈ వేసవిలో అకాల వర్షాలతో అప్పుడప్పుడు వాతావరణం కాస్త చల్లబడింది. అయితే గురువారం నుంచి అసలు వేసవికాలం ప్రారంభం కానుందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్ లో పొడి వాతావరణం ఏర్పడుతుందని.. దీని వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.
దాదాపు అన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది వాతావరణశాఖ. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండ ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరగనున్నాయి. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవంతో జనాలు ఉక్కిరిబిక్కిరికానున్నారు. అలాగే ఈ రోజు నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నిన్న తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అది క్రమంగా బలపడుతూ రేపటికి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో ఒకట్రెండు చోట్ల తేలిక పాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకా శముందని వాతావరణశాఖ వెల్లడించింది.