CM Chandrababu Naidu to pensioners(AP latest news): జూలై 1వ తేదీ నుంచే పెంచిన పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన పెన్షన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎల్లుండి నుంచే పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా స్కీం కింద పెంచిన రూ.1000తో కలిపి పెన్షన్లను అందజేస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఒకేసారి రూ.1000 పెంచి పెన్షన్లను అందజేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలిపారు.
దివ్యాంగులకు ఇకపై నెలకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకూడదని, ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించి.. ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజు నుంచే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు.
పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతినెలా అదనంగా రూ.819 కోట్ల భారం ఉండనుందని తెలిపారు. గత ప్రభుత్వం పెన్షన్ దారులను ఎంతో క్షోభకు గురిచేసిందని, వారి కష్టాలను చూసి చలించిపోయానని లేఖలో పేర్కొన్నారు. ఎర్రటి ఎండలో.. వడగాల్పుల్లో పెన్షన్ల కోసం పడిన కష్టాలను చూసే.. ఏప్రిల్ నుంచి రూ.1000 పెంచిన పెన్షన్లను అమలు చేసి.. జులై 1న రూ.7 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.