AP CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఏపీలో ఏ అంటే అమరావతి అని, పీ అంటే పోలవరం అని చెప్పారు. అమరావతిలో ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి పోరాటాన్ని గుర్తుచేశారు. రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందన్నారు.
ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రాజధాని రైతులకే దక్కుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఆందోళన విరమించారని.. 1631 రోజులు పోరాటం చేశారని చెప్పారు.
రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత ప్రభుత్వ పాలనలో చూశామని చంద్రబాబు జగన్పై విమర్శలు గుప్పించారు. అందుకే ప్రజలు వైసీపీకి కేవలం 11 సీట్లిచ్చారన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ గోదావరిలో కలిపేసిందన్నారు.
Also Read: ఏపీలో మార్పు కనిపిస్తోంది.. ఇదే కొనసాగితే ఇక అద్భుతాలే!
జగన్ ప్రజా వేదికను కూల్చి పరిపాలన ప్రారంభించారన్నారు. రాజధానిలో ఏర్పాటు చేసిన నమూనాలను కొన్ని అల్లరి మూకలు ధ్వంసం చేశాయన్నారు. వాటిని కాపాడుకోవడానికి అమరావతి రైతులు విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించికోలేదని ఎక్కడ కట్టిన బిల్డింగులు అలాగే ఉన్నాయన్నారు. ఐకానిక్ కట్టడాలన్నీ ఆగిపోయాయన్నారు. అసెంబ్లీ, ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు ఉండాల్సిన చోట తుమ్మ చెట్లు మొలిచాయన్నారు చంద్రబాబు నాయుడు.