CM Chandrababu Emotional Comments in Kuppam: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంగా పలు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతానన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘ఇప్పటివరకు 8 సార్లు కుప్పం నుంచి గెలిచాను. మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారు. అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశం కల్పించాం. రాష్ట్ర కేబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చాం’ అంటూ ఆయన అన్నారు.
‘నేను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు. ఇప్పటివరకు నన్ను 8 సార్లు గెలిపించిన కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం.
Also Read: క్యూ ఆర్ కోడ్తో డిప్యూటీ సీఎంకు సలహాలు
కుప్పం ప్రశాంతమైన స్థలం. ఇక్కడ హింసకు చోటు లేదు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు.. జాగ్రత్త. అహంకారంతో విర్రవీగితే.. ప్రజాస్వామ్యంలో వైసీపీకి పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నాను. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాను. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలుపుతా. సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశాం. కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించాం.
కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. అన్ని గ్రామాలకు తాగు నీరు అందిస్తాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తాం. అన్ని గ్రామాలు, పంట పొలాల వద్ద రోడ్లు వేస్తాం. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం. వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం వస్తుంది. స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తాం. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.