chikoti: చికోటి ప్రవీణ్. తెలుసుగా. మోస్ట్ పాపులర్ గ్యాంబ్లర్. హైదరాబాద్లోనే ఉంటాడు. నేపాల్, శ్రీలంక, థాయ్లాండ్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తాడు. విదేశాలకు వెళ్లేది.. ఆడేది.. కూడా తెలుగు వాళ్లే. అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపారులు, ఉద్యోగులే ఇతని కస్టమర్లు.
పెద్ద ఖర్చేమీ కాదు. మనిషికి 3 లక్షలు. ఫారిన్ ట్రిప్లా ప్లాన్ చేస్తాడు. వెళ్లేవారంతా ఆయా దేశాలను చూసేందుకు కాదు. అక్కడికి వెళ్లి కాయ్ రాజా కాయ్ ఆడేందుకు. ప్యాకేజ్ 3 లక్షలే అయినా.. గ్యాంబ్లింగ్లో మరిన్ని లక్షలకు లక్షలు బెట్టింగ్ కాస్తుంటారు. అందులో చికోటికి కమిషన్ ముడుతుంది. ఇండియాలో గ్యాంబ్లింగ్పై నిషేధం ఉంది. అందుకే లొకేషన్ ఛేంజ్ చేశాడు ప్రవీణ్.
ఈ విషయం ఈడీ పసిగట్టింది. పెద్ద ఎత్తున మనీలాండరింగ్కు పాల్పడుతున్నాడని అతని ఇంటిపై రైడ్ చేసింది. విస్తృత తనిఖీలు చేసి, సమగ్రంగా ప్రశ్నించి వదిలేసింది. అదే సమయంలో చికోటి ఫామ్హౌజ్ విషయం వెలుగుచూసింది. అందులో రకరకాల జాతుల జంతువులు, పాములతో ప్రవీణ్ లగ్జరీ లైఫ్ గడిపేవాడని తెలిసింది. చికోటితో సంబంధాలు ఉన్నాయనే కారణంతో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోదరులు, పీఏను సైతం విచారించింది ఈడీ.
కట్ చేస్తే.. లేటెస్ట్గా థాయ్లాండ్లో అక్కడి స్థానిక పోలీసులు ఓ కాన్ఫరెన్స్ హాల్పై దాడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతోందని గుర్తించారు. 93 మందిని అరెస్ట్ చేశారు. అందులో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఆ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నది అతనే మరి.
అరెస్ట్ అయిన వారిలో 83 మంది ఇండియన్సే. అందులో తెలుగువారే అధికం. 15 మంది వరకు మహిళలు కూడా ఉన్నారు. మాధవ్ రెడ్డి అనే పొలిటికల్ లీడర్ కూడా దొరికిపోయాడు. ఏప్రిల్ 27 నుంచి ఆ హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్ను రెంట్కు తీసుకుని.. గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నాడట చికోటి. ఘటనా స్థలంలో 20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్ను సీజ్ చేశారు థాయ్ పోలీసులు. ఈ హోటల్లో సుమారు ₹100 కోట్ల మేర గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. గ్యాంబ్లింగ్కు ఉపయోగించిన పరికరాలన్నింటినీ భారత్ నుంచే తీసుకొచ్చినట్లు గుర్తించారు.
థాయ్లో ఓ పూర్తిస్థాయి గ్యాంబ్లింగ్ సెటప్నే ఏర్పాటు చేసి.. ఇండియా నుంచే సర్వం తరలించి.. ఇక్కడి వారినే అక్కడకు తీసుకెళ్లి.. 100 కోట్ల మేర దందా చేయిస్తున్నారంటే.. చికోటి ప్రవీణ్ నెట్వర్క్ మామూలుగా లేదుగా.