Chirutha attack in tirumala(Latest news in Andhra Pradesh): గురువారం రాత్రి 9.10 గంటలు సమయం. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ కుటుంబం కాలి నడక తిరుమల వెళుతోంది. ఆ సమయంలో 4 ఏళ్ల బాలుడి కౌశిక్ తాతతో కలిసి షాపు వద్ద చిప్స్ ప్యాకెట్ కొనుకుంటున్నాడు. ఇంతలోనే భయానక ఘటన జరిగింది. ఒక్కసారిగా చిరుత దూసుకొచ్చింది. ఆ బాలుడిని మెడ పట్టుకుని అడివిలోకి లాక్కెల్లింది. క్షణాల్లోనే తేరుకున్న బాలుడి తాత అరుస్తూ చిరుత వెంట పరుగెత్తాడు. పోలీసులు వేగంగా స్పందించారు. కొందరు భక్తులు, స్థానిక దుకాణదారులు అడవిలోకి చిరుత వెంట పరుగులు తీశారు. టార్చ్లైట్లు వేసి రాళ్లు విసురుతూ కేకలు వేశారు. దీంతో చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది.
అలిపిరి నడక దారిలోని ఏడు మైలురాయి దగ్గర ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది, భక్తులు, స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించారు. అందువల్లే ఆ పసివాడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడికి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి.వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత తిరుపతి పద్మావతి హృదయాల ఆస్పత్రికి తరలించారు. కౌశిక్ కు సిటీ స్కాన్ చేశారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ పసివాడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
తిరుమల నడకమార్గంలో ఇలా చిరుత వచ్చి బాలుడిపై దాడి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం వేల మంది భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళతారు. క్రూర జంతువులు వారిపై దాడి చేసే అవకాశాలున్నాయి. తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.