Chandrababu Mahanadu Speech(Political news in AP): తెలుగుజాతిని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని.. అందుకు సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కార్యకర్తల త్యాగాలు మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని.. రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పిలుపుఇచ్చారు చంద్రబాబు.
రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు. 2వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయన్నారు చంద్రబాబు. పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు.
స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో 2.47 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువేనని విమర్శించారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.
ప్రపంచ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రం ఏపీయేనని.. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని.. రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని దుయ్యబట్టారు.
ప్రభుత్వ స్పాన్సర్స్ టెర్రరిజం పెరిగిందని.. పెట్టుబడులు లేవని.. జాబ్ క్యాలెండర్ లేదని.. నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదని.. చంద్రబాబు విమర్శించారు. లేని దిశా చట్టాన్ని అమలు చేస్తున్నారని.. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతామని.. కేసుల కోసం ప్రధానికి సాష్టాంగం చేస్తున్నారని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని, కోడికత్తి దాడి, మద్య నిషేధం లాంటివన్నీ డ్రామాలేనని మండిపడ్డారు.
సంక్షేమం, అభివృద్ధి.. టీడీపీ సైకిల్కున్న రెండు చక్రాలన్నారు చంద్రబాబు. నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడినా ఎవ్వరూ భయపడలేదని.. జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలూ ఉన్నారన్నారు. కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని, భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఓ కురుక్షేత్ర సంగ్రామమని.. కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దామని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్ధంగా ఉందని.. మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు చంద్రబాబు.