![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/07/PAWAN-KALYAN-INSIDE-ARTICAL-IMAGE.jpg)
Pawan Kalyan latest news today(Political news in AP): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీలో కేసు నమోదైంది. వాలంటీరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేనాని చేసిన ఆరోపణలపై ఆ వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ పై సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలోనూ వాలంటీర్ వ్యవస్థపై మరోసారి పవన్ విమర్శలు గుప్పించారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే నెల రూ. 10 వేల జీతం ఇస్తామన్నారు. కానీ జగన్ ప్రభుత్వం అమ్మే ఆంధ్రాగోల్డ్ విస్కీ 180 ఎంఎల్ రేటు రూ.130. బూమ్..బూమ్ రేటు రూ.200 ఉందన్నారు. వాలంటీర్ల రోజువారీ జీతం రూ.164 మాత్రమేనని .. అంటే ఆంధ్రాగోల్డ్కు ఎక్కువ.. బూమ్ బూమ్కు తక్కువ అని సెటైర్లు వేశారు.
వాలంటీర్లలో కొందరే దుర్మార్గులున్నారని పవన్ స్పష్టం చేశారు. అలాంటి వారు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. లొంగనివారిని పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. మరి వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారం హైదరాబాద్ లోని నానక్రామ్గూడకు ఎందుకు పంపిస్తున్నారు? ప్రశ్నించారు. అక్కడ ఉన్న ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీకి ఈ సమాచారం వెళ్లట్లేదా? అని నిలదీశారు. ఆ సమాచారం దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.