Viveka Murder Case (AP News Updates): వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివ శంకర్ రెడ్డి కలిసి ఆధారాలు తారుమారు చేశారని రిపోర్టులో సీబీఐ వెల్లడించడం కలకలం రేపుతోంది.
హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడని.. గూగుల్ టేకౌట్లో తేలిందని సీబీఐ చెబుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించేందుకు.. ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా డెడ్బాడీని బాత్రూం నుండి బెడ్రూంకి ఉదయ్ కుమారే తీసుకొచ్చాడని తేల్చింది. తన తండ్రి ప్రకాష్రెడ్డితో మృతదేహానికి కుట్లు వేయించాడని.. వివేక తలకు ఉన్న గాయాలు కనపడకుండా బ్యాండేజ్లు వేసారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది సీబీఐ. ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతాడనే అనుమానంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది.
“హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్రెడ్డి ఉన్నారు. హత్య జరిగిన స్థలంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చెరిపి వేశారని అనేందుకు సాక్ష్యాలున్నాయి” అంటూ సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.