Viveka Case Updates(Andhra Pradesh News) : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఏప్రిల్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంపీ తండ్రి భాస్కర్రెడ్డి ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కడప నుంచి తరలించారు.
శుక్రవారం ఉదయం పులివెందులలో అతడిని అదుపులోకి తీసుకుని తొలుత కడప కారాగారం అతిథిగృహానికి సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. వివేకా హత్యపై అతడిని ప్రశ్నించారు. అనంతరం ఉదయ్ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మరోవైపు ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డితోపాటు ఘటనాస్థలికి ఉదయ్ వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. గతంలో చాలాసార్లు అతడిని సీబీఐ ప్రశ్నించింది.
ఇంతకుముందు సీబీఐ ఎస్పీగా పనిచేసిన రాంసింగ్ పై ఉదయ్ కుమార్ కేసు పెట్టాడు. తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు చేశాడు. వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి కాంపౌండర్గా పని చేస్తున్నాడు. వైఎస్ వివేకా మృతదేహానికి జయప్రకాష్ రెడ్డి కుట్లు వేసినట్టు తెలుస్తోంది. సునీల్ బెయిల్ పిటిషన్ కౌంటర్లో ఉదయ్ కుమార్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి పాత్రలను సీబీఐ వెల్లడించింది. ఇలా వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసును త్వరగా కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.