Viveka Murder Case latest news(Breaking news in Andhra Pradesh): అదిగో అరెస్ట్. ఇదిగో అరెస్ట్. ఎంపీ అవినాష్రెడ్డి అరెస్ట్పై కొన్ని నెలలుగా హడావుడి నడుస్తోంది. వివేకా హత్య కేసులో ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతలోనే అవినాష్రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక, హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారాయన.
కానీ, అంతలోనే సీబీఐ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మే 31న అవినాష్కు ముందస్తు బెయిల్ వస్తే.. జూన్ 3, శనివారం విచారణకు హాజరైన సమయంలో అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసేసింది సీబీఐ. అయితే, హైకోర్టు సూచించిన మేరకు.. వెంటనే రిలీజ్ కూడా చేసింది. ఇద్దరి నుంచి 5 లక్షల పూచీకత్తు తీసుకుని అవినాష్రెడ్డిని విడుదల చేసింది. ఇది జరిగి వారం అవుతున్నా.. అటు సీబీఐ కానీ, ఇటు అవినాష్రెడ్డి కానీ.. ఈ విషయాన్ని బయటకు వెళ్లడించకపోవడం ఆసక్తికరం. అంటే, వివేకా హత్య కేసులో ఏ8 నిందితుడుగా ఉన్న అవినాష్రెడ్డి.. ప్రస్తుతం అరెస్టై బెయిల్ మీద బయట ఉన్నారన్న మాట.
మరోవైపు, అవినాష్రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి ప్రధాన కుట్రదారని.. సీబీఐ విచారణను అడ్డుకుంటున్నారని.. కోర్టుకు తెలిపారు సునీత తరఫు న్యాయవాది. ఏప్రిల్ 24 తర్వాత సీబీఐ నాలుగుసార్లు సమన్లు జారీ చేసినా.. అవినాష్రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత దాఖలు చేసిన పిటిషన్పై.. సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.