![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/07/JAGAN-DADI-INSIDE-ARTICAL-IMAGE.jpg)
Jagan kodi kathi case updates(Andhra Pradesh today news) : ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పై విశాఖలో జరిగిన కోడికత్తితో దాడి ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ కీలక విషయాలు వెల్లడించింది. ఈ దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.
ఈ కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఇన్-కెమెరా పద్ధతిలో విచారణ జరిగింది. కోడికత్తితో దాడి కేసుపై లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని ఎన్ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు ముగిసిన తర్వాత మళ్లీ లోతైన దర్యాప్తు డిమాండ్ తీసుకురావడమేంటని అన్నారు. సాక్ష్యాలను పక్కాగా సేకరించామని తెలిపారు. ఈ కేసులో శ్రీనివాసరావు ఒక్కడే నిందితుడని తేలిందన్నారు. జగన్ పై దాడి వెనుక కుట్ర కోణంపై ఎక్కడా ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ను అనుమతించొద్దని న్యాయస్థానాన్ని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిందితుడు ఐదేళ్లు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని తెలిపారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే నిందితుడికి న్యాయం ఆలస్యం అవుతుందని చెప్పారు. సీఎం జగన్, ఎన్ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయమూర్తి ఏ.సత్యానంద్ ఈ నెల 25కి వాయిదా వేశారు.