AP Inter First Year Supplementary Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం సచివాలయంలో విడుదల చేశారు. ఫలితాలలో పాసైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు మళ్లీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. విద్యార్థులు ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు.
ఈ ఏడాది మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. కాగా.. ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 18న విడుదల చేశారు. ఇంటర్మీడియట్ షార్ట్ మార్క్స్ మెమోలు జులై 1వ తేదీ నుంచి https://bieap.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
Also Read: AP EDCET 2024: ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా !
రీవెరిఫికేషన్ కు అవకాశం..
అన్ని అంశాలను పరిశీలించి, ఆన్సర్ షీట్స్ ను మూల్యాంకనం చేసినట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఫస్టియర్ విద్యార్థులు ఆన్సర్ స్క్రిప్ట్ల రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవొచ్చని పేర్కొన్నది. జూన్ 28 నుంచి జులై 4 వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవొచ్చని సూచించింది. అయితే, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.