CM Chandrababu Naidu on Polavaram project(AP news live): ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరమన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నారు.
‘మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదల. అధికారిక వెబ్సైట్లలో వాటిని అందుబాటులో ఉంచుతాం. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారంటూ చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తనకు కళ్ల వెంట నీళ్లొచ్చాయంటూ ఆవేదన చెందారు.
పోలవరం ప్రాజెక్టుపై గత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా ఏటా చేసిన ప్రసంగాలతోపాటు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోలను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.
Also Read: వరుస సమీక్షలతో బిజీబిజీ.. పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం కీలక చర్చలు
‘పోలవరం ప్రాజెక్టుపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం విడుదల చేస్తాం. నదుల అనుసంధానానికి పోలవరం గుండెలాంటిది. అలాంటి పోలవరానికి జగన్ ఒక శాపంలా మారారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని నేరం చేశారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండూ ప్రధాన ప్రాజెక్టులు. ఈ రెండూ కూడా రాష్ట్రానికి రెండు కళ్లలాంటివి. వీటిని పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చుకోవొచ్చు. రాష్ట్ర అభివృద్ధికి జల విద్యుత్ కీలకంగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి మేలు జరగనున్నది. 2014 – 19 మధ్య మా హయాంలో పోలవరానికి రూ 11,762 కోట్లు ఖర్చు చేశాం. కానీ, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. జగన్ ప్రమాణం చేస్తూనే పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేశారు’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కావాలనే కాంట్రాక్టర్ ను తొలగించారు. సమర్థులైన అధికారులను కూడా బదిలీ చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని హైదరాబాద్ ఐఐటీ బృందం తెలిపింది. ఆ విషయం జగన్ కు రెండేళ్ల తరువాత తెలిసింది. కాంట్రాక్టర్లను మార్చొద్దని పీపీఏ హెచ్చరించినా పట్టించుకోలేదు. 2009లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే విధంగా కాంట్రాక్టర్లను మార్చారు. దీంతో అప్పుడు చాలా హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. తండ్రి చేసిన తప్పే కొడుకు కూడా చేశారు. 2019 ఆగస్టు 16న సీఎస్ కు పీపీఏ లేఖ రాస్తూ.. ఏజెన్సీలను మార్చొద్దంటూ అందులో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ బృందం కూడా జగన్ సర్కారు తప్పిదాలను ఎత్తి చూపింది. కాఫర్ డ్యామ్ గ్యాప్ లు పూర్తి చేసే సమయంలో ఏజెన్సీని మార్చారు. 2018లో డయాఫ్రమ్ వాల్ ను రూ. 436 కోట్లతో మేం పూర్తి చేస్తే.. దాని మరమ్మతులకే రూ. 447 కోట్ల వరకు ఖర్చయ్యింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ. 990 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీనిని నిర్మించేందుకు కనీసం రెండు సీజన్లు అవసరం. కాఫర్ డ్యామ్ సీపేజ్ వల్ల ఏ పనులూ చేసే పరిస్థితి లేదు’ అంటూ జగన్ పై మండిపడ్డారు.
Also Read: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు
‘జగన్ వల్ల పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారిపోయాయి. జగన్ సర్కారు అసమర్థత కారణంగా గైడ్ బండ్ కుంగిపోయింది. రూ. 80 కోట్లతో నిర్మించిన ఈ గైడ్ బండ్ పనికిరాకుండా మారింది. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ హయాంలో కేవలం 3.84 శాతం మాత్రమే పనులు జరిగాయి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ. 3,385 కోట్లను మళ్లించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులకు సంబంధించి ప్రశంసలు దక్కితే.. వైసీపీ హయాంలో పీపీఏ, ఐఐటీ నిపుణుల చీవాట్లు దక్కాయి. పోలవరం ప్రాజెక్టు మరమ్మతుల పనుల కోసం కెనడా, అమెరికా నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నాం. వాళ్లు ఇక్కడే ఉంటి ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు పనులను పర్యవేక్షిస్తారు. అయితే, ఏజెన్సీని మార్చకపోయి ఉండి ఉంటే 2020లోనే ప్రాజెక్టు పూర్తయ్యేది. జగన్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రూ. 4,900 కోట్ల వరకు నష్టం జరిగింది. ఖర్చు 38 శాతం పెరిగిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తినీ కోల్పోయాం. పోలవరం ఆలస్యం కారణంగా రైతులకు రూ. 45 వేల కోట్ల నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహాయంతో సవాళ్లను అధిగమిస్తాం. పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడబోం.’ అని సీఎం పేర్కొన్నారు.