Central Cabinet expansion news(Latest political news in India) : కేంద్రంలో మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాలను మారుస్తోంది. తాజాగా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చేసింది. కొత్తవారికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.
ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రాల నుంచి కీలక నేతలకు కేబినెట్లో స్థానం దక్కుందని తెలుస్తోంది. దీంతో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై చర్చ నడుస్తోంది. కేంద్రమంత్రి పదవికి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బండి సంజయ్ను ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి పార్టీ కోసం ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. దీని వల్ల కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వర్తించడానికి సమయం ఉండదు. అలాగే బీజేపీలో జోడు పదవులు ఉండకూడదనే విధానం ఉంది. దీంతో కిషన్ రెడ్డిని తప్పిస్తే తెలంగాణ నుంచి బండి సంజయ్ కు స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి జీవీఎల్కు కేబినెట్లో చోటు దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గంలో మార్పులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కిషన్రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉన్నా కేబినెట్ భేటీకి వెళ్లలేదు. దీంతో కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేశారని ప్రచారం సాగుతోంది. ఆయన 2019 మే 30 నుంచి 2021 వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021 నుంచి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.