Etela Rajender Latest News(BJP News Telangana): ఈటల రాజేందర్ వర్సెస్ జితేందర్ రెడ్డి ఎపిసోడ్ టీకప్పులో తుఫానుగా సమసిపోయింది. ఇద్దరి మధ్య జరిగిన ట్వీట్ వార్.. ఒక్క భేటీతో ముగిసిపోయింది. బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రంగంలోకి దిగి.. వీరిద్దరినీ కలిపారని తెలుస్తోంది. జితేందర్ రెడ్డి ఫాంహౌజ్కు వెళ్లిన ఈటల రాజేందర్.. వాళ్లిద్దరే ఏకాంతంగా గంటకు పైగా వన్ టు వన్ చర్చలు జరిపారు. బయటకు వచ్చాక.. నవ్వుతూ ఆలింగనం చేసుకున్నారు.
మాజీ ఎంపీ జితేందర్రెడ్డి.. బండి సంజయ్ అనుచరుడిగా ఉన్నారు. బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతా ఈటలనే చేస్తున్నారనే అనుమానం ఉంది. బండికి, ఈటలకు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీంతో.. పరోక్షంగా ఈటలను టార్గెట్ చేస్తూ.. జితేందర్రెడ్డి ఇటీవల ఓ దున్నపోతును వెనుక నుంచి కాలితో తన్ని.. బండిలో ఎక్కించే వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కొందరికి ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటూ కామెంట్ కూడా చేయడం పార్టీలో కలకలం రేపింది. ఆ ట్వీట్పై ఈటల సైతం ఘాటుగానే స్పందించారు. వయసు, అనుభవంను దృష్టిలో పెట్టుకుని.. జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
కట్ చేస్తే.. బండారు దత్తాత్రేయ పెద్దరికంతో జితేందర్రెడ్డి, ఈటల రాజేందర్ల మధ్య సయోధ్య కుదిరింది. ఫాంహౌజ్ మీటింగ్.. ఆ ఇద్దరినీ ఒక్కటి చేసింది.