Bhatti Vikramarka: 110 రోజులు.. 1,360 కిలోమీటర్ల దూరం .. భట్టి విక్రమార్క పాదయాత్ర ఇలా సాగింది. ఇవాళ్టితో ముగియనుంది. మూడు నెలల కింద.. ఆదిలాబాద్ జిల్లా బోథ్లో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్.. 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో జనగర్జన సభ భారీగా నిర్వహించేందకు సర్వం సిద్ధం చేశారు. భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సత్కరించనున్నారు.
ఇప్పటికే భట్టి పాదయాత్రను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో సైతం.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. భట్టిని ఘనంగా సత్కరించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పొంగులేటిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన తర్వాత.. భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సత్కరిస్తారు. ఈ సందర్భంలో భట్టి చేసిన పాదయాత్రను కొనియాడనున్నారు. రాహుల్ ప్రసంగంలో సైతం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
మరికొన్ని నెలల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతోంది. ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. దీంతో ఈ సభలో రాహుల్ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.