Raghunandan Rao: తెలంగాణలో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పార్టీకి గుడ్ చెబుతారని తెలుస్తోంది. పార్టీలో పరిణామాలపై కొద్దిరోజులుగా రఘునందన్ అసహనంగా ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని అలకబూనారు. ఇదే విషయంపై ఇటీవల తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కమలం పార్టీ వరుస షాకులు తగులుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ డీలా పడింది. పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలు వెనకడుగువేశారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నా కాషాయ కండువాలు కప్పుకునేందుకు ఇతర పార్టీ నేతలెవరూ ముందుకురావడంలేదు.
మరోవైపు బీజేపీలో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారని ప్రచారం సాగుతోంది. ఆ బాధ్యతలు కేంద్రమమంత్రి కిషన్ రెడ్డికి ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అటు పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొద్దిరోజుల క్రితం అనుచరులతో మంతనాలు జరిపారు. ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని బలంగా వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే దారిలో ఉన్నారని అంటున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. అక్కడ ఓటమి ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. చేరికల సంగతి అలా ఉంచితే పార్టీలో కీలక నేతలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతుండటం కాషాయ పార్టీలో కలవరం రేపుతోంది. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూడాలి మరి.