Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభ రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. BRSకి షాక్ మీద షాక్ తగులుతోంది. చాలామంది ద్వితీయశ్రేణి నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇల్లందు మాజీ మున్సిపల్ ఛైర్మన్ యదలపల్లి అనసూర్య బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచులు, ఒక జడ్పీటీసీ, 26 మంది ఎంపీటీసీలు, ఏడుగురు ఉప సర్పంచులు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేతలందరూ ఆదివారం ఖమ్మంలో జరిగే జనగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 40 వేల మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.
సత్తుపల్లి మున్సిపాలిటీలో BRS కు ముగ్గురు కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ తోట సుజల రాణితోపాటు 16వ వార్డు కౌన్సిలర్ దుదిపళ్ల రాంబాబు, 20 వార్డు కౌన్సిలర్ పద్మజ్యోతి పార్టీకి రాజీనామా చేశారు. పదవి ఉన్నా పనులు చేయలేకపోయామని, కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారని వైస్ ఛైర్ పర్సన్ సుజల రాణి ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తంమీద ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభ ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. జిల్లాపై కాంగ్రెస్ పట్టు పెరిగి అవకాశం కనిపిస్తోంది. నేతల చేరికలతో పార్టీ బలం పెరగనుంది. జిల్లాలో బీఆర్ఎస్ బలం అంతంత మాత్రమే .. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపడటం ఆ పార్టీని కలవర పెడుతోంది.