Ponguleti: ఖమ్మం బహిరంగ సభ నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అనుచరులు భారీగా ఆయన వెంటనే పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.
ఖబడ్దార్ పొంగులేటి అంటూ ఖమ్మంలోని మమత హాస్పిటల్ ఏరియాలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పోస్టర్లలో రాశారు. పొంగులేటి అనుచరులు మువ్వా విజయ్ బాబు, కార్తీక్ ను ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ సభకు ఒకరోజు ముందు వార్నింగ్ లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని మువ్వా విజయ్ బాబు క్షమాపణ చెప్పకపోతే శవాలు కూడా దొరకవంటూ పోస్టర్లలో రాయడం అలజడి రేపుతోంది.
పోస్టర్ల ఏర్పాటుపై పొంగులేటి స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నందునే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన అనుచరులను చంపి శవాలు కూడా లేకుండా చేస్తామని వార్నింగ్ ఇవ్వడంపై భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ జనగర్జన సభ ముగిసే వరకు మంచి నీళ్ల సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖమ్మంలో కాంగ్రెస్ సభను విజయవంతం చేసి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు.