Srinivasa Rao: తెలంగాణహెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఈ నియోజకర్గంలో పర్యటిస్తున్నారు.
తాజాగా తన పుట్టినరోజు వేడుకలను కొత్తగూడెంలో ఘనంగా జరుపుకున్నారు గడల శ్రీనివాసరావు. ఆయన అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొని
బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపానికి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో డప్పులు వాయిస్తూ, కోలాట బృందాలతో నృత్యం చేసి అలరించారు.
తన పుట్టినరోజు వేడుకల్లో గడల శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లే కొత్తగూడెంలోనూ రావణాసురుడు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతా రామరాజ్యం నడుస్తుంటే ఇక్కడ మాత్రం రావణాసురుడు ప్రజలను, అధికారులను ఇబ్బంది పెడుతూ రాజ్యాన్ని ఏలుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఇస్తున్న నిధులకు ప్రజలకు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
అతి త్వరలోనే రావణాసురుడి పాలన అంతమవుతుందని శ్రీనివాసరావు అన్నారు. దీపావళిని కొత్తగూడెం ప్రజలు జరుపుకుంటారని తెలిపారు. ఎవరు ఎవరికి భయపడాల్సిన పనిలేదని తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కొత్తగూడెం ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజలు తన వెంట నడవాలని కోరారు.
ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్నారు. వనమాను ఉద్దేశించే గడల శ్రీనివాసరావు విమర్శలు చేశారని స్థానికులు అంటున్నారు.