Congress: కాంగ్రెస్ జనగర్జన సభకు ఖమ్మం ముస్తాబవుతోంది. ఆదివారం జరిగే సభకు ఎస్ఆర్ గార్డెన్స్ వెనుక ఉన్న వంద ఎకరాల్లో చేస్తున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సభ నిర్వహణ పనులు పొంగులేటి, భట్టి వర్గాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు టీపీసీసీ చీఫ్ రేవంత్.
వచ్చే ఎన్నికలకు ఖమ్మం నుంచే శంఖారావం పూరించబోతోంది టీ కాంగ్రెస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఈ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అదే సమయంలో 100 రోజులకుపైగా నిర్వహించిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కను ఘనంగా సత్కరించనున్నారు. ఒకే వేదికపై రెండు భారీ కార్యక్రమాలు జరగనుండటంతో సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
రాహుల్ గాంధీతోపాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరుకానున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికలకు ఈ సభను శంఖారావంగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించేలా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా. వాహనాల పార్కింగ్ కోసం 50 ఎకరాల స్థలాన్ని రెడీ చేశారు.
మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ సభకు బీఆర్ఎస్ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సభను సక్సెస్ చేసి తీరుతామన్నారు.