Saichand singer death news(Breaking news updates in telangana): తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్ హౌజ్ లో అర్ధరాత్రి వేళ గుండెపోటుకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం తొలుత నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో.. వెంటనే హైదరాబాద్ గచ్చీబౌలీలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. తెల్లవారుజామున సాయిచంద్ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు కేర్ ఆస్పత్రికి తరలివచ్చారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.
1984 సెప్టెంబర్ 20 న వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించిన సాయిచంద్.. పీజీ చేశారు. విద్యార్థి దశ నుంచే కళాకారుడిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. ధూం ధాం కార్యక్రమాల్లో పాటలు పాడి.. ప్రజలను ఉర్రూతలూగించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై ఎన్నో పాటలను రాశారు. కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించినా.. అక్కడ సాయి చంద్ పాటలు ఉండాల్సిందే అన్న రీతిలో ఎదిగాడు.
ముఖ్యంగా రాతి గుండెల్లో కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా.. అంటూ తెలంగాణ అమర వీరులపై సాయిచంద్ పాడిన పాట.. ఎన్నో హృదయాలను కదిలిచింది. ఒకానొక సమయంలో సీఎం కేసీఆర్ సైతం ఈ పాటకు కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. 2021 డిసెంబర్ లో సాయిచంద్ ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో యువనాయకుడిగా సాయిచంద్ కొనసాగుతున్నారు. సాయిచంద్ మృతిపట్ల.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్, మంత్రులు హరీష్ రావు .. సాయిచంద్ మృతదేహానికి నివాళి అర్పించారు. తెలంగాణ మంచి గాయకుడిని కోల్పోయిందని.. సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించారు.
సాయిచంద్ అకాల మరణం తనను కలచి వేసిందని రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సాయిచంద్ గుండెపోటు తో మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటన్నారు.