Hyderabad news telugu(Telangana today news):దేశంలోనే తొలిసారి తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. RRR రోడ్డుకు సమాంతరంగా ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 320 కిలో మీటర్ల పరిధిలో హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న పలు జిల్లాలను కలుపుకొని నిర్మాణం ఉంటుందని చెప్పారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన కొత్త వివాదానికి ఆజ్యం పోసింది.
రీజినల్ రింగ్ రోడ్డు పై వివాదాలు పూర్తిగా ముగియక మునుపే.. మరో కొత్త వివాదం మొదలైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. 340కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డును రాష్ట్రానికి కేటాయించింది. దీనికి సుమారు 16వేల కోట్లు అవసరంకాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించాలి. అయితే ఇందులో సుమారు 5వేల 500 కోట్ల రూపాయలు ఒక్క భూసేకరణ కోసమే ఖర్చవుతోంది.
రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. అనేక ప్రాంతాల్లో భూములిచ్చేందుకు స్థానికులు నిరాకరించడంతో.. వారిని బుజ్జగించి భూమిని సేకరించడం అధికారులకు తలకుమించిన భారమైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ భూ సేకరణ పూర్తికాలేదు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. దీంతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చర్చనీయాంశమైంది. తక్షణమే భూసేకరణ జరపాలని రైల్వే అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి స్థానిక రైతులు భూములు అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.